ఉత్తరప్రదేశ్ లో సమాజ్వాదీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణా యాదవ్ బుధవారం బీజేపీలో చేరింది. గతకొద్దిరోజులుగా వస్తున్న వార్తలను నిజం చేస్తూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు.
ఉత్తర్ప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య, భాజపా యూపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్.. ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. తాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విధానాలకు ప్రభావితం అయినట్టు తెలిపారు. ఇక, తనకు అవకాశం ఇచ్చినందుకు బీజేపీకి కృతజ్ఞతలు తెలిపారు. తాను దేశానికి సేవ చేసేందుకు ముందుకు వచ్చాను.. అందుకే బీజేపీలో చేరానన్నారు.
ములాయం సింగ్ రెండో భార్యకు పుట్టిన ప్రతీక్ యాదవ్ను అపర్ణ వివాహం చేసుకున్నారు. 2017 ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ తరఫున పోటీ చేశారు. భాజపా అభ్యర్థి రీటా బహుగుణ చేతిలో పరాజయం పాలయ్యారు.
ఇటీవలి కాలంలో సమాజ్వాదీ పార్టీలో ఉన్నప్పటికీ భాజపా ప్రభుత్వ విధానాలను సమర్థిస్తూ.. బహిరంగంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసించి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఈ
క్రమంలో ఆమె కాషాయ కండువా కప్పుకుంటారనే ప్రచారం జోరుగా జరిగింది. అపర్ణా యాదవ్ తర్వాత ములాయం సింగ్ యాదవ్ బావమరిది ప్రమోద్ గుప్తా కూడా లక్నోలో బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తోంది.
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కేబినెట్ లో పనిచేసిన ముగ్గురు మంత్రులు ఇటీవలనే బీజేపీకి గుడ్ బై చెప్పి సమాజ్ వాదీ పార్టీలో చేరారు. ఈ ముగ్గురు కూడా బీజేపీని వీడిన తర్వాత ఆ పార్టీపై. యూపీ సీఎం యోగిపై తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాదు కొందరు ఎమ్మెల్యేలు కూడా ఎస్పీలో చేరారు.
అయితే అపర్ణ యాదవ్ చేరికతో బీజేపీ నేతలకు పెద్ద ఊరట దక్కినట్టుగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ములాయం కుటుంబంలో ఇప్పుడు బీజేపీ చీలిక తెచ్చింది.
సచివాలయ వ్యవస్థ వల్లే అనేక సమస్యలు: పురందేశ్వరి