దేశంలో తొలిసారిగా వ్యవసాయేతర ఆస్తులు కలిగివున్న ప్రజలందరికీ మెరూన్ కలర్ పట్టాదార్ పాస్ బుక్స్ జారీచేయనున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. నిన్న రాత్రి రెవెన్యూ చట్టం అమలు, ధరణి పోర్టల్ లో వ్యవసాయేతర ఆస్తుల నమోదు తదితర అంశాలపై ప్రగతి భవన్ లో మంత్రులు, ఉన్నతాధికారులతో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో అమలులోకి రానున్న కొత్త రెవెన్యూ చట్టం ద్వారా పేద, మధ్య తరగతి సహా ప్రజలందరి ఆస్తులకు పూర్తి స్థాయి రక్షణ కల్పించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని పేర్కొన్నారు. ప్రజల యొక్క దీర్ఘకాలిక, విశాల ప్రయోజనాలను ఆశించి ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. భూ వివాదాలు , ఘర్షణలను నివారించడంతో పాటు ప్రజల ఆస్తులకు పక్కా హక్కులు కల్పించడం కోసం ఈ పాస్ పుస్తకాలను జారీ చేస్తున్నట్లు కేసీఆర్ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, పంచాయతీరాజ్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్ రావు, జీహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.