పంజాబ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హోషియార్పూర్లో జరిగిన ఈ ప్రమాదంలో పదిమంది దుర్మరణం చెందగా మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ఉస్మాన్ షాహీద్ గ్రామానికి చెందిన వీరంతా హిమాచల్ప్రదేశ్, ఉనా జిల్లాలోని ప్రార్థనా మందిరాన్ని దర్శించుకొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
కుటుంబ సభ్యులతో కలిసి పీర్ నిగాహను దర్శించుకునేందుకు గురువారం మహింద్రా బొలెరో వాహనంలో బయలుదేరారు. తిరుగు ప్రయాణంలో వాహనం అదుపు తప్పి రోడ్డుపక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. దీంతో వ్యానులోనుంచి ప్రయాణీకులు బయటకు ఎగిరి పడ్డారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో గాయపడిన అందరినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.