కరోనా పరీక్షలపై దాఖలైన పలు పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. కరోనా పరీక్షల విషయంలో ప్రభుత్వంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మృతదేహాలకు కరోనా పరీక్షలు అవసరం లేదన్న ప్రభుత్వ ఉత్తర్వులను కొట్టివేసింది. లక్షణాలు లేని హైరిస్క్ వ్యక్తులకు ఎందుకు పరీక్షలు చేయడంలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
మిగతా రాష్ట్రాలతో పోల్చితే తక్కువ పరీక్షలు ఎందుకు చేస్తున్నారని వివరణ ఇవ్వాలని సూచింది. మార్చి 11 నుంచి ఇప్పటివరకు చేసిన పరీక్షల వివరాలు సమర్పించాలని స్పష్టం చేసింది. కరోనా పరీక్షలపై కేంద్రం రెండుసార్లు రాసిన లేఖలను కూడా సమర్పించాలని కోరింది. కరోనా కిట్లు వైద్య సిబ్బందిలో ఎంతమందికి ఇచ్చారో తెలపాలని సూచించింది. అన్ని వివరాలతో జూన్ 4 లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.