కరోనా వ్యాప్తిని అరికట్టడానికి తెలంగాణ ప్రభుత్వం అనేక రకాల మార్గాలను అన్వేషిస్తున్నట్టు తెలుస్తోంది. కరోనా కేసులు ఇంకా పెరిగితే బాధితులకు విస్తృత సేవలందించే ఉద్దేశంతో కీలక నిర్ణయం తీసుకుంది. గడచిన ఐదేళ్ల కాలంలో పదవీ విరమణ చేసిన వైద్యులు, నర్సింగ్ సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించింది.
వీరందరికీ కాంట్రాక్టు పద్ధతిలో మూడు నెలలపాటు పోస్టింగ్ ఇవ్వాలని ఆయా విభాగాలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో కరోనా మరింత విజృంభిస్తే బాధితులకు ఏ రకమైన సేవలందించాలన్న దానిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న ప్రభుత్వం పరిస్థితి తీవ్రమైనప్పుడు వైద్యులు, సిబ్బంది కొరత ఏర్పడకుండా ఉండేందుకు ఈనిర్ణయం తీసుకుంది.