ఏపీలోని విశాఖపట్నం జిల్లాలో ఆహ్లాదకరంగా సాగుతున్న అరకు బెలూన్ ఫెస్టివల్ కు సందర్శకులు పోటెత్తుతున్నారు. ఈ రోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి, ఆయన మనవడు దేవాన్ష్ అరకు బెలూన్ ఫెస్టివల్ లో సందడి చేశారు. కుమారుడు దేవాన్ష్, స్నేహితులతో కలిసి పసుపు-ఎరుపు రంగులో ఉన్నహాట్ ఎయిర్ బెలూన్ లో బ్రాహ్మణి విహరించారు.
బెలూన్ లో విహరించిన అనంతరం బ్రాహ్మణి మీడియాతో మాట్లాడుతూ.. ఈ బెలూన్ ఫెస్టివల్ లో 15 దేశాల నుంచి ఆపరేటర్లు పాల్గొంటున్నారని తెలిపారు. అరకు కాఫీకి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. బెలూన్ ఫెస్టివల్ ద్వారా అరకును ప్రపంచ పటంలో పెట్టాలన్నది ఏపీ ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. మరోవైపు బ్రాహ్మణి భర్త, ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ ప్రస్తుతం దావోస్ సదస్సులో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్ వెళ్లిన సంగతి తెలిసిందే.