*ఘనంగా లాల్ దర్వాజ అమ్మవారి బోనాల జాతర
*అమ్మవారి దర్శనానికి ఫోటెత్తిన భక్తులు
*భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు
హైదరాబాద్లో అమ్మవారి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆషాడమాసం చివరి ఆదివారం లాల్దర్వాజ సింహవాహిని అమ్మవారి బోనాల ఉత్సవం కన్నులపండువగా జరుగుతోంది.
ప్రభుత్వం తరుపున తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్దలతో అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు.రేపు రంగం, ఘటం ఊరేగింపు ఉండనుంది.
కాగా..సింహవాహిని మహంకాళి అమ్మవారికి ఆనవాయితీగా మొదటి బోనాన్ని దేవేందర్ గౌడ్ కుమారుడు, కోడలు మొదటి బోనాన్ని సమర్పించారు.
ఇక, తెలుగు కెరటం, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కూడా బోనమెత్తి అమ్మవారికి బోనం సమర్పించుకుంది. ఈ సందర్భంగా పీవీ సింధును ఆలయ కమిటీ సత్కరించింది. ప్రతిఏడాది సింహవాహిని అమ్మవారిని దర్శించుకుంటానని అన్నారు. గతేడాది పోటీల కారణంగా రాలేకపోయానని…ఈ సారి బోనం సమర్పించటం సంతోషంగా ఉందన్నారు. ప్రజలందరికీ బోనాల జాతర శుభాకాంక్షలు తెలిపారు.
మరోవైపు.. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి దర్శనం కోసం తరలివచ్చారు. రద్దీ పెరగడంతో గంటలపాటు క్యూ లైనులో వేచి చూస్తున్నారు.
బోనాలు సందర్భంగా పాతబస్తీలో పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఇబ్బందులు ఏర్పడకుండా లాల్ దర్వాజ పరిసర ప్రాంతల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ఈ రోజు నుంచి రేపటి వరకూ చార్మినార్, మీరు చౌక్, ఫలక్ నుమా, బహదూర్ పురా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.