టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విజన్ ఉన్న నాయకుడని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు అవలంబించిన విజన్ 2020 వల్లే హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ ఘన విజయం సాధించడం ఖాయమని అన్నారు.
దాదాపు 13 ఏళ్ల తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, నేను మాట్లాడుకున్నామని జగ్గారెడ్డి అన్నారు. తాను తొలిసారి ఎమ్మెల్యే అయింది టీఆర్ఎస్ నుంచేనని చెప్పారు. సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ ఏర్పాటుపై అసెంబ్లీలో తాను అడగ్గానే సానుకూలంగా స్పందించినందుకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. మెడికల్ కాలేజీ ఏర్పాటుపై జీవో రాగానే ముఖ్యమంత్రిని కలుస్తానని అన్నారు. పార్టీలకతీతంగా కేసీఆర్ను సంగారెడ్డికి ఆహ్వానించి ఘనంగా సన్మానిస్తానని తెలిపారు.