తెలంగాణలో జులై 1వ తేదీ నుంచి చేపట్టనున్న పల్లె ప్రగతి, హరితహారంపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. జులై 1 నుంచి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ప్రారంభించాలన్నారు. నిర్దేశించిన ఏ పనీ పెండింగ్లోఉండేందుకు వీల్లేదన్నారు. పంచాయతీరాజ్ శాఖకు ప్రభుత్వం బాగా సహకరిస్తోంది. పనులు ఎందుకు పెండింగ్లో ఉన్నాయో సమీక్ష చేసుకోవాలని ఆదేశించారు. గ్రామాల్లో ప్రతి ఇంటికి 6 మొక్కలు ఇచ్చి నాటించాలన్నారు. ఎన్నడూ లేని విధంగా పంటలతో రాష్ర్టం ధాన్యాగారంగా మారింది. రాష్ట్రానికి అదనపు రైస్ మిల్లులు అవసరం ఉందన్నారు. రైస్ మిల్లుల సంఖ్యను పెంచి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. 250 ఎకరాల్లో ఒక్కో ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్.. సెజ్ల చుట్టూ బఫర్ జోన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బఫర్ జోన్ల పరిధిలో లేఔట్లు, నిర్మాణాలకు అనుమతులు ఇవ్వొద్దన్నారు. వ్యవసాయ శాఖ, పోలీసులు కల్తీ విత్తనాలను అరికట్టాలని ఆదేశించారు. గ్రామాల్లో విద్యుత్ సమస్య పరిష్కారానికి పవర్ డే పాటించాలి. పోడు భూముల సమస్య పరిష్కారానికి సమగ్ర నివేదిక తయారు చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. రికార్డుల్లో ఉన్న 66 లక్షల ఎకరాల అటవీ భూముల హద్దులు గుర్తించాలని చెప్పారు.
previous post
next post