ఈ సంవత్సరం వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. వేసవికాలంలో సాధారణ ఉష్ణోగ్రతలతో పోలిస్తే 0.5 నుంచి 1 డిగ్రీ సెల్సియస్ వరకూ అధిక వేడిమి ఉంటుందని, భూతాపం కారణంగా వాతావరణంలో వస్తున్న మార్పే ఇందుకు కారణమని ఐఎండీ తన తాజా నివేదికలో పేర్కొంది.మార్చి రెండో వారం నుంచి ఎండ మంట పెరగడం ప్రారంభం అవుతుందని తెలిపింది.
మేలో వడగాడ్పులు వీస్తాయని, ఆపై మరింతగా వేడిమి పెరుగుతుందని ఈ రిపోర్టు పేర్కొంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు తాకుతాయని అంచనా వేసింది. ఈ ఎండ ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ, కోస్తాంధ్ర జిల్లాలపై అధికంగా ఉంటుందని, దక్షిణ కోస్తాలో 45 డిగ్రీల వరకు, రాయలసీమలో 43 నుంచి 44 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని ఐఎండీ తెలిపింది.