అమ్మాయిలపై అఘాయిత్యాలు బాధాకరమని తెలంగాణ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్ధిపేటలోని ప్రభుత్వం బాలికల పాఠశాలలో సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అల్పాహార సేవా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ దిశపై అఘాయిత్యం ఘటన ఆవేదనకు గురిచేసిందని అన్నారు. అమ్మాయిలు తమను తాము రక్షించుకునే విధంగా నెలలో ఒకసారి శిక్షణ ఇవ్వాలని అన్నారు. తల్లిదండ్రుల వైఖరిలో మార్పు రావాలని అన్నారు.
మగపిల్లలకు విద్యతో పాటు విలువ, సంస్కారంతో కూడిన విద్య నందించాలని అన్నారు. ఆడపిల్లలపై కన్నా ఎక్కువగా మగపిల్లలపై దృష్టి పెట్టాలని, వాళ్లు ఏం చేస్తున్నారన్న విషయాలను గమనిస్తూ వుండాలని తల్లిదండ్రులకు సూచించారు. పాఠశాల అభివృద్ధి నిమిత్తం రూ.25 లక్షలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. మరో రూ. 50 లక్షలు వచ్చే ఏడాది మంజూరు చేస్తామని చెప్పారు. ఈ మూడు నెలలు దించిన తల ఎత్తకుండా చదవాలని విద్యార్థులకు సూచించారు. జిల్లాలో ఈ పాఠశాల నెంబర్ వన్ గా వుండాలని మంత్రి కోరారు.