అక్రమంగా భారత్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన పాకిస్థానీ చొరబాటుదారుడిని సరిహద్దులో భారత బలగాలు కాల్చి చంపాయి. అతను చేసిన ప్రయత్నాన్ని నిలువరించేందుకు సరిహద్దు బలగాలు చేసిన ప్రయత్నం ఫలించక పోవడంతో కాల్పులు జరపాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే…నిన్న సాయంత్రం భద్రతా బలగాలు చెక్పోస్టు వద్ద కాపలా కాస్తుండగా గేట్ నంబర్ 103 ద్వారా భారత్లోకి ప్రవేశించేందుకు ఓ వ్యక్తి ప్రయత్నిస్తూ కనిపించాడు. దీంతో అప్రమత్తమైన సైనికులు అతన్ని వెనక్కి వెళ్లాలని హెచ్చరించారు.
అయినప్పటికీ అతను పట్టించుకోకుండా ముందుకు వెళ్లడంతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అతను అక్కడికక్కడే చనిపోగా, అతని వద్ద బ్యాగులో జత దుస్తులు, సిమ్ కార్డు, మెమరీ కార్డు లభించాయి. మృతుడు గుల్నవాజ్గా జవాన్లు గుర్తించారు. ఘటనపై సరిహద్దులోని పాకిస్థాన్ జవాన్లకు సమాచారం ఇచ్చినా వారు స్పందించలేదు. అయితే చొరబాటు దారుడిని కాల్చి చంపిన నేపథ్యంలో సరిహద్దులో హై అలర్ట్ ప్రకటించారు.