తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం చాలా దూరంలోనే ఉన్నప్పటికీ.. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్ని ఇప్పటి నుంచే ఎన్నికల వ్యూహాలు రచిస్తూ.. ముందుకు సాగుతున్నాయి. దీనికి అనుగుణంగా సమావేశాలు, సభలు నిర్వహించడానికి సిద్ధమవుతున్నాయి.
తాజాగా..బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా , కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, జేపీ నడ్డాలు ఈ వారం తెలంగాణకు రానున్నారు. ఈ నేపథ్యంలోనే వారి రాకపై స్పందించిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. రాజకీయ పర్యాటకులు వస్తున్నరు అంటూ వారిపై విమర్శలు గుప్పించారు. వారు తెలంగాణకు రావడం కేవలం రాజకీయ పర్యాటకం మాత్రమేనని విమర్శించారు.
ఎన్నికలకు ముందు చాలా మంది రాజకీయ పర్యాటకులు రాష్ట్రాన్ని సందర్శిస్తారని అన్నారు. వారు తెలంగాణ ప్రజలకు చేసిందేమి లేదని పేర్కొన్నారు. అయితే టీఆర్ఎస్ ప్రజల కోసం నిజంగా పనిచేస్తుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. రాహుల్ గాంధీ సభపైనా ఆమె తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ పర్యటన సందర్భంగా రైతుల సమస్యలపై వరంగల్లో జరగాల్సిన బహిరంగ సభపై కేవలం రాజకీయాల కోసమేనని ఆరోపించారు.
రైతులకు వారు ఏం చేశారని ప్రశ్నించారు. “తెలంగాణ వరి సేకరణ సమస్య నడుస్తున్నప్పుడు, మేము దానిని పార్లమెంటులో లేవనెత్తాలని మరియు తెలంగాణ రైతులను ఆదుకోవాలని రాహుల్ గాంధీని అభ్యర్థించాము. కానీ, పార్లమెంటులో తెలంగాణ, రైతుల గురించి మాట్లాడలేదన్నారు. ఇప్పుడు ఆయన ఇక్కడ ఏదో ‘రైతు సంఘర్షణ సభ’ ప్లాన్ చేస్తున్నారు. ఇది రాజకీయం తప్ప మరొకటి కాదు’ అని కవిత ఆరోపించారు.