హైదరాబాద్ నగరంలోని చిక్కడపల్లికి చెందిన ఓ వ్యాపారిని ఆదివారం అర్ధరాత్రి దుండగులు కిడ్నాప్ చేశారు. కొన్ని గంటలపాటు ఉత్కంఠ రేపిన ఈ ఘటన చివరకు సుఖాంతమయ్యింది. వ్యాపారి నుంచి మూడు కోట్ల రూపాయలు డిమాండ్ చేసిన దుండగులు కోటి రూపాయలు తీసుకుని వదిలేశారని తెలుస్తోంది. పోలీసుల కథనం ప్రకారం ..చిక్కడపల్లికి చెందిన గజేంద్రప్రసాద్ ఆటో ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాడు. ఇతనికి ముంబయికి చెందిన కొన్ని వర్గాలతో వ్యాపార లావాదేవీలు ఉన్నాయి.
వ్యాపార వ్యవహారాల విషయంలో ఇరువర్గాల మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గజేంద్రప్రసాద్ను కిడ్నాప్ చేశారు. అనంతరం కుటుంబ సభ్యులకు ఫోన్చేసి రూ.3 కోట్లు డిమాండ్ చేశారు. సంప్రదింపుల అనంతరం దుండగులు కోటి రూపాయలు తీసుకుని ఈరోజు ఉదయం అబిడ్స్లో గజేంద్రప్రసాద్ను విడిచిపెట్టారు. ప్రస్తుతం నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.