*జగనన్నా విద్యా దివేన నగదు విడుదల..
*చదువు అనేది ఒక మనిషి చరిత్రను మారుస్తుంది….
* చదువు అనేది మనం పిల్లలకు ఇచ్చే గొప్ప ఆస్తి..
పెద్ద చదువులు మనిషి చరిత్రను, కుటుంబ చరిత్రను, సామాజిక వర్గ చరిత్రను, రాష్ట్ర చరిత్రను.. అంతెందుకు ఒక దేశ చరిత్రను మారుస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం తిరుపతిలో పర్యటించారు.
తారకరామ స్టేడియంలో గురువారం జరిగిన విద్యాదీవెన నగదు జమ కార్యక్రమంలో పాల్గొని మొత్తం 10.85 లక్షల మంది విద్యార్థులకు రూ.709 కోట్ల డబ్బును నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు.
ఈ సందర్భంగా బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. చదువు అనేది మనం పిల్లలకు ఇచ్చే గొప్ప ఆస్తి..అది ఎవరూ దొంగిలించలేని ఆస్తి. తలరాతలు మార్చేసే శక్తి చదువుకు మాత్రమే ఉందని నమ్మే వ్యక్తిని నేను అని జగన్ వెల్లడించారు
పాదయాత్రలో ఎన్నో కష్టాలను కళ్లారా చూశా. ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు పిల్లలను చదువుకు దూరం చేయకూడదనుకున్నా. అందుకే.. విద్యార్థులకు లబ్ధి చేకూరే పథకాలతో గొప్ప విప్లవం తీసుకొచ్చాం అన్నారు సీఎం జగన్. విద్యాదీవెన అనేది రాష్ట్రంలోనే గొప్ప పథకం అని, అవినీతికి తావు లేకుండా నేరుగా తల్లుల అకౌంట్లోనే డబ్బులు జమ చేస్తున్నామని అన్నారు.
అరకోర ఫీజులతో, రీయంబర్స్మెంట్లతో గత ప్రభుత్వం వ్యవహరిస్తే.. క్రమం తప్పకుండా బకాయిలు చెల్లించి మరీ విద్యా వ్యవస్థను సమర్థవంతంగా నడిపిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వానికి, మా ప్రభుత్వానికి వచ్చిన మార్పు ఏంటో మీరే గమనించడని తల్లిదండ్రులను ఉద్దేశించి సీఎం జగన్ కోరారు.
అంతేకాదు గతంలోని ప్రభుత్వం.. నాడు-నేడు, వసతి దీవెన లాంటి పథకం ఏదైనా అమలు చేశారా? అని సీఎం జగన్ ప్రశ్నించారు. నాడు – నేడు కార్యక్రమంతో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు పూర్తిగా మర్చామని జగన్ అన్నారు.