*ముంబయి శివాజీ పార్కులో లతా మంగేష్కర్ అంత్యక్రియలు
* అంత్యక్రియలకు హాజరైన ప్రధాని మోదీ.
* గాన కోకిలకు ముంబై వాసులు ఘన నివాళి
* నింగికేగిసిన కోయిలమ్మ లతా మంగేష్కర్ కు స్వర నివాళి..
*శివాజీ పార్కుకు భారీగా తరలి వచ్చిన అభిమానులు..
లెజెండరీ సింగర్ , భారతరత్న అవార్డు గ్రహీత లతా మంగేష్కర్ అంత్యక్రియలు అధికార లాంఛనాలతో పూర్తయ్యాయి. లతా మంగేష్కర్ అంత్యక్రియలు.. ముంబైలోని శివాజీ పార్క్లో అశృనయనాల మధ్య జరిగాయి.
ప్రభుత్వ లాంఛనాలు పూర్తి అయ్యాక, లతా మంగేష్కర్ అంత్యక్రియల చితిపై ఆమె సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్ అగ్నిని వెలిగించారు.
లతాజీ మరణం యావత్ సినీ ప్రపంచాన్ని శోకసంద్రంలోకి నెట్టి దివికేగారు. ఎన్నో పాటలకు తన గొంతుతో ప్రాణం పోసిన ఆ గానకోకిల మూగబోయిందని తెలిసి అభిమానులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు.
శివాజీ పార్క్లో ఆమె పార్థివ దేహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ప్రధాని మోదీతో పాటు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, క్రికెటర్ సచిన్ దంపతులు, పలువురు కేంద్ర మంత్రులు, మహారాష్ట్ర కేబినెట్ మంత్రులు.. లతా మంగేష్కర్కు తుది వీడ్కోలు పలికారు.
ఆమె నివాసం నుంచి మొదలైన లతా మంగేష్కర్ అంతిమయాత్రకు అభిమానులు తరలివచ్చారు. అంతిమయాత్ర శివాజీ పార్కుకు చేరుకునే వరకు ఆ దారి అంతా జనసంద్రాన్ని తలపించింది. సాయంత్రం 6.30 గంటలకు శివాజీ పార్కులో ఆమె అంత్యక్రియలు జరిగాయి. అంతకుముందు ఆమె పార్థివ దేహానికి గౌరవ వందనం సమర్పించారు.
కడసారిగా ఆమె పార్థివదేహాన్ని చూసి నివాళులు అర్పించేందుకు రాజకీయ, సినీ ప్రముఖులు సహా అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు