హీరోయిన్గా అగ్రస్థానానికి చేరుకుంటున్న సమయంలోనే పద్దెమినిదేళ్ల వయస్సులో దివ్య భారతి బాలీవుడ్ నిర్మాత సాజిద్ నడియాద్వాలాను పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో 1993 ఏప్రిల్లో తమ అపార్టుమెంటులోని ఐదో అంతస్తు నుంచి జారి పడి మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె మృతిపై అనేక కథనాలు పుట్టుకొచ్చాయి. దివ్య భారతిని ఉద్దేశపూర్వంగానే కిందకు తోసేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ తరువాత సాజిద్ జర్నలిస్టు వార్దాను రెండో వివాహం చేసుకున్నారు. అయితే ఇటీవల దివ్య వర్ధంతి(ఏప్రిల్ 5) సందర్భంగా అభిమానులు ఆమెపై ట్రోలింగ్కు దిగారు. ఈ విషయంపై స్పందించిన వార్దా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దివ్య కుటుంబం, మా కుటుంబం ప్రతీ వేడుకలోనూ పాలుపంచుకుంటాం. మీరు నన్ను ట్రోల్ చేసినంత మాత్రాన నాకు వచ్చే నష్టమేమీ లేదు. దివ్య పుట్టినరోజు, తనకు సంబంధించిన ఇతర కార్యక్రమాలను మేం జరుపుకొంటాం. ఆ సమయంలో తను నాతో మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. తన సినిమాలు చూస్తున్నప్పుడు మా పిల్లలు పెద్దమ్మ అంటూ సంతోషం వ్యక్తం చేస్తారు. మా అందమైన జీవితాల్లో తను ఎప్పుడూ జీవించే ఉంటుంది. సాజిద్ దివ్య వాళ్ల నాన్నను తన తండ్రిలా చూసుకుంటారు. నిజం చెప్పాలంటే నేను ఏనాడు దివ్య స్థానాన్ని భర్తీ చేయాలనుకోలేదు. నాకంటూ ఓ ప్రత్యేక స్థానం ఉంది. అలాగే దివ్య మిగిల్చిన అందమైన జ్ఞాపకాలు మాతోనే ఉన్నాయి అని చెప్పుకొచ్చారు.