telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఆస్తుల నమోదు విషయంలో దళారులను నమ్మొద్దు: కేటీఆర్

ktr telangana

ఆస్తుల నమోదు విషయంలో దళారులను నమ్మొద్దని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ ప్రక్రియ మొత్తం ఉచితంగా జరుగుతుందని తెలిపారు. ఈ విషయంలో ఎవరికీ ఒక్కపైసా కూడా ఇవ్వొద్దని చెప్పారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో గ్రేటర్ పరిధిలోని రెవెన్యూ సమస్యలపై కేటీఆర్ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించాలనే ఉదేశంతోనే కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చామని అన్నారు. హైదరాబాదులో సుమారు 24.50 లక్షల ఆస్తులు ఉన్నట్టు అంచనా వేశామని కేటీఆర్ తెలిపారు. ప్రజలంతా నిశ్చింతగా వారి ఆస్తిపై హక్కులను పొందేలా చేయడమే తమ ప్రయత్నమని చెప్పారు.

సామాన్యుడికి కొత్త రెవెన్యూ చట్టం అండగా ఉంటుందని, అవినీతికి పాతర వేస్తూ కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చామని అన్నారు. రానున్న రోజుల్లో అన్ని రిజిస్ట్రేషన్లు ధరణి పోర్టల్ ద్వారానే జరుగుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని, మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ లోకేశ్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి, గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

Related posts