ఏపీలో మూడు రాజధానుల అంశంపై రచ్చ జరుగుతున్నా నేపథ్యంలో అమరావతిలో శాసన రాజధాని కూడా ఉండకూడదని మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొడాలి నాని వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని చెప్పారు. శాసన రాజధానిని అమరావతి నుంచి తరలిస్తామని ప్రభుత్వం చెప్పలేదని అన్నారు.
అన్ని వర్గాల ప్రజలు ఉండేందుకు అనువుగా రాజధాని ఉండాలనే ఉద్దేశంతో నాని అలా మాట్లాడారని చెప్పారు. కొంత మందే రాజధానిలో ఉండాలనే అభిప్రాయం తప్పు అనేది నాని భావించారని తెలిపారు.
రాజధానిలో పేదలకు పట్టాలు ఇవ్వొద్దని చెప్పడం సబబు కాదని తెలిపారు. ఇళ్ల పట్టాల పంపిణీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని అన్నారు. కొందరు కూట్రపూరితంగా ఇళ్ల పట్టాల పంపిణీకి అడ్డుపడుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.