తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా పరిధిలోని షాద్నగర్లో విషాదం ఘటన చోటు చేసుకుంది. కదులుతున్న రైలు ఎక్కబోయి కింద పడిన మహిళ తీవ్రగాయాలతో మృతి చెందింది.
వివర్లాలోకి వెళితే..
కడప జిల్లాకు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ జ్యోతిరెడ్డి(28) హైదరాబాద్లో హెచ్డీఎఫ్సీ బ్యాంకులో ఉద్యోగిగా, జూనియర్ ఆర్టిస్టుగా పనిచేస్తోంది. పండుగ నిమిత్తం సొంత ఊరికి వెళ్లిన ఆమె సోమవారం రాత్రి తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ వచ్చేందుకు రైల్వేకోడూరులో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కింది. కాచిగూడ వరకు టిక్కెట్ కొనుగోలు చేసింది.
మంగళవారం తెల్లవారుజామున 5గంటల సమయంలో రైలు షాద్నగర్లో ఆగింది. అయితే కాచిగూడ అని భావించి రైలు దిగింది. తాను దిగిన స్టేషన్ కాచిగూడ కాదని తెలుసుకుని తిరిగి ఎక్కే క్రమంలో.. అప్పటికే రైలు కదులుతుండటంతో అదుపుతప్పి కిందపడి గాయపడింది.
ఈ ఘటనలో జ్యోతి తలకు బలమైన గాయాలు కావడంతో వెంటనే రైల్వే పోలీసులు గుర్తించి ఆమెను వైద్యం నిమిత్తం హైదరాబాద్ మలక్పేటలోని యశోద ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.
జ్యోతి మృతిపై తమకు అనుమానాలున్నాయని… పోలీసులు సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. దీంతో మృతురాలి బంధువులు, స్నేహితులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.