లక్నో లో జర్నలిస్టుల వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా మరో సీనియర్ జర్నలిస్టును పొట్టన పెట్టుకున్నారు దుండగులు. జర్నలిస్టులను చంపడం యూపీలో చాలా సహజం గా మారడం ఆందోళన కలిగిస్తోంది. ఆగస్టు నెల మూడో వారంలో లిక్కర్ మాఫియా ఓ జర్నలిస్టును చంపిన ఘటన మరవకముందే తాజాగా మరో సీనియర్ జర్నలిస్ట్ హతం కావడం చర్చానీయాంశమైంది. ఖుషీనగర్లోని దుబోలి గ్రామ సమీపంలో 55 సంవత్సరాల సీనియర్ జర్నలిస్ట్ రాధేశ్యాం శర్మను దుండగులు అతి దారుణంగా చంపేశారు. లోకల్ హిందీ పత్రికలో పనిచేస్తున్న శర్మ తన బైకుపై వెళుతుండగా అడ్డగించిన దుండగులు కిరాతకంగా హతమార్చారు. శర్మ గొంతు కోసి అతి భయానకంగా మర్డర్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.
లిక్కర్ మాఫియా అశిష్ జన్వాని అనే జర్నలిస్ట్ను హతమార్చింది. ప్రముఖ హిందీ పత్రికలో పనిచేసే సదరు జర్నలిస్టు తమ కార్యకలాపాలకు అడ్డొస్తున్నాడని దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. ఆ సమయంలో ఆయన వెంట ఉన్న సోదరుడు కూడా కాల్పుల్లో మృతి చెందాడు. జర్నలిస్టుగా అశిష్ జన్వానికి ఆ ప్రాంతంలో మంచి పేరుంది. ఆ క్రమంలో లిక్కర్ మాఫియా అతడిని కాల్చి చంపడంతో స్థానికంగా పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. అయితే అతడిని ఇదివరకు లిక్కర్ మాఫియా బెదిరించిన ఘటనలో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని లోకల్గా వినిపించిన మాట. అవినీతి, అక్రమాలను వెలికి తీస్తున్న జర్నలిస్టులను ఇలా చంపడంపై ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి.