ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ నేత, టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి హైదరాబాద్లోని తెలంగాణ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద హల్చల్ చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కలిసేందుకు వచ్చిన జేసీని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ప్రగతి భవన్ వద్ద పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అపాయిట్మెంట్ లేకుండా ఎవరినీ లోపలికి అనుమతించేది లేదని సెక్యూరిటీ సిబ్బంది చెబుతున్నా కారును గేటు వరకూ పోనిచ్చారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది గేట్లు మూసివేసి జేసీకి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
సీఎం లేకపోతే మంత్రి కేటీఆర్ను కలుస్తానంటూ జేసీ దివాకర్ రెడ్డి సెక్యూరిటీ సిబ్బందికి చెప్పారు. అయినప్పటికీ అనుమతి కావాల్సిందేనని సెక్యూరిటీ సిబ్బంది ప్రగతి భవన్లోనికి పంపించకపోవడంతో జేసీ వెనుదిరిగాడు. చెప్పడంతో రోడ్డుపైనే కొద్దిసేపు నిల్చున్న జేసీ అక్కడి నుంచి కారులో వెళ్లిపోయారు. అయితే జేసీ ప్రగతిభవన్కు ఎందుకు వచ్చారనే విషయంలో తెలియాల్సి ఉంది.
ఇటీవల తెలంగాణ అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో ‘ఆంధ్రప్రదేశ్ను వదిలేసి తెలంగాణకు వస్తా. మేం తెలంగాణ వదిలిపెట్టి నష్టపోయాం. రాయల తెలంగాణ కావాలని నాడు జైపాల్రెడ్డిని అడిగితే ఒప్పుకోలేదు’’ అని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.. ఇప్పుడు ప్రగతి భవన్ దగ్గర పోలీసులతో వాగ్వాదానికి దిగి.. మరోసారి వార్తల్లోకి ఎక్కారు.