ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా ఇప్పుడు లాక్డౌన్ నడుస్తుంది. ఈ లాక్డౌన్ తో సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా బస్తీలలో ఉండే పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్తీలలో ఉండే ప్రజలంతా దాదాపుగా రోజూవారీ కూలీలే… ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా ఈ పేద ప్రజలకు పని లేకుండా పోయింది. దీంతో నిత్యావసర వస్తువులు, బియ్యం తదితర సామాగ్రిని కొనుక్కోవడానికి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పేద ప్రజలకు సహాయం చేయడానికి ముందుకొస్తున్నారు. తాజాగా జూబ్లీహిల్స్ కార్పోరేటర్ కాజా సూర్యనారాయణ ఫిల్మ్ నగర్ లోని పేద ప్రజలకు సహాయం చేశారు.
లాక్ డౌన్ విధించి ఇన్ని రోజులు గడుస్తున్నా కూడా ఫిల్మ్ నగర్ పరిధిలోని దీన్ దయాల్ నగర్ పేదలకు ఇప్పటి వరకు సరైన సహాయం అందలేదనే చెప్పాలి. సహాయం చేసేవారు కూడా చేసిన చోటే చేస్తుండడంతో… సహాయం అందని ప్రజలకు అందకుండా పోతోంది. ఇక లాక్ డౌన్ పొడిగించిన నేపథ్యంలో పేదలకు నిత్యావసర సరుకులను అందించడానికి జూబ్లీహిల్స్ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ గారి విజ్ఞప్తి మేరకు చంద్రశేఖర్ రెడ్డి గారు (అల్లు అర్జున్ మామ గారు) ముందుకొచ్చారు. తనవంతు సహాయంగా దీన్ దయాల్ నగర్ మరియు భగతసింగ్ కాలనీలో నివసించే దాదాపు 500 కుటుంబాలకు 10 కేజీల బియ్యంతో పాటు నిత్యావసర సరుకులను పేదలకు పంచారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ కేసీఆర్ గారి పిలుపు మేరకు రెడ్డీస్ లాబ్ వారి సౌజన్యంతో పేదలు సహాయం చేస్తున్నామని, కాజా సూర్యనారాయణ గారి విజ్ఞప్తి మేరకు ఇంకొన్ని బస్తీలో ఈ కార్యక్రమం చేపడుతామని చెప్పారు.
కాజా సూర్యనారాయణ గారు మాట్లాడుతూ గత కార్పొరేషన్ ఎన్నికల్లో ఇంచార్జిగా చంద్రశేఖర్ రెడ్డి గారు తన గెలుపు కోసం కృషి చేశారని, అలాగే అడిగిన వెంటనే సహాయం చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు ఈ సమయంలో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ డ్రైనేజీ సమస్య లేకుండా చేస్తున్న కార్మికులకు ఫిలింనగర్ సొసైటీ ప్రెసిడెంట్ ఆది శేషగిరిరావు గారు, ప్రధాన కార్యదర్శి కాజా సూర్యనారాయణ గారి మరియు కమిటీ సభ్యులు నిరంజన్ బాబు, ఆధ్వర్యంలో ఫిలింనగర్ లో పారిశుధ్య కార్మికులకు బియ్యం, నిత్యావసర సరుకులు పంచారు.