సాధారణంగా ఎవరైనా ఏ పండో తింటూ పొరపాటున విత్తనాలు మింగితే, నెత్తిన మొక్కలు వస్తాయేమో అని .. చెప్పి హాస్యం చేస్తుంటాం. ఒకవేళ అది నిజమే అయి, మొక్కలు వస్తే.. అదే పరిస్థితిలో ఒక విచిత్ర కేసు ను వైద్యులు పరీక్షిస్తున్నారు.. చికిత్స ఫలితం మాత్రం లేకపోయింది. ఆ వివరాలు .. చేతులకు చెట్ల బెరడులాంటి మొలకలతో తాను అనుభవిస్తున్న బాధ వర్ణనాతీతంగా ఉందని ‘ట్రీ మ్యాన్’గా పేరొందిన బంగ్లాదేశ్ యువకుడు అబుల్ బజందర్ ఆవేదన వ్యక్తం చేశాడు. డాక్టర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా తన వ్యాధిని నయం చేయలేకపోతున్నారని, అందుకే చివరగా తన చేతుల్ని తొలగించుకోవాలనే నిర్ణయానికి వచ్చానని అబుల్ పేర్కొన్నాడు.
అరుదైన సిండ్రోమ్ కారణంగా చేతులకు చెట్ల బెరుడుల్లా మొలకలు వచ్చే వ్యాధితో అబుల్ బాధపడుతున్నాడు. 2016 నుంచి ఇప్పటి వరకూ అతనికి డాక్టర్లు 25 శస్త్రచికిత్సలు చేశారు. ఆ జబ్బును నయం చేయగలమని వైద్యులు దృఢంగా నమ్ముతున్నప్పటికీ, ఎలాంటి పురోగతి కనిపించకపోవడంతో అబుల్ గతేడాది మే నుంచి చికిత్స తీసుకోవడం మానేశాడు. వ్యాధి తీవ్రత మరింత పెరగడంతో ఈ ఏడాది జనవరిలో తిరిగి ఆస్పత్రిలో చేరాడు. ఈ బాధ భరించడం నా వల్ల కాదు. రాత్రులు సరిగా నిద్ర పట్టడం లేదు. డాక్టర్లకు నా చేతులు తొలగించమని చెప్పాను. అప్పుడైనా నాకు కొంచెం ఉపశమనం లభిస్తుందని ఆశిస్తున్నానని’ అబుల్ తన దీన స్థితిని వివరించాడు.
అతడి తల్లి అమీనా బీబీ మాట్లాడుతూ.. ‘కనీసం నొప్పి నుంచి అయినా కాస్త ఉపశమనం పొందుతాడేమో.. ప్రస్తుతం నరకం అనుభవిస్తున్నాడని’ ఆవేదన వ్యక్తం చేసింది. ఎపిడెర్మెడైప్లాసియా వెర్రుక్కిఫోర్మిస్ జన్యు సంబంధ వ్యాధిని ‘ట్రీ మ్యాన్ సిండ్రోమ్’గా కూడా పిలుస్తారు. మెరుగైన చికిత్స కోసం విదేశాలకు వెళ్లాలని ఉన్నప్పటికీ, తనకు అంతటి ఆర్థికస్తోమత లేదని అబుల్ పేర్కొన్నాడు. అబుల్ తాజా అభ్యర్థనపై ఢాకా మెడికల్ కళాశాల ప్లాస్టిక్ సర్జన్ చీఫ్ సమంత లాల్ సేన్ గుప్తా ఏడుగురు డాక్టర్లతో కూడిన బృంద సమావేశంలో ఒక నిర్ణయానికి వస్తామని చెప్పారు. ‘అతడు తన వ్యక్తిగత అభిప్రాయం చెప్పాడు. అయితే ఆ సమస్యకు ఏది మెరుగైన పరిష్కారం ఇస్తుందో అదే చేస్తామని’ సేన్ పేర్కొన్నారు.
బంగ్లా ప్రధాని షేక్ హసీనా.. అబుల్కు ప్రభుత్వం తరఫున ఉచిత వైద్యం అందిస్తామని చెప్పారు. మొదటి విడత చికిత్సలో భాగంగా దాదాపు రెండు సంవత్సరాలు ఆస్పత్రిలోని ప్రైవేట్ వింగ్లోనే అబుల్ గడపాల్సి వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి అరుదైన వ్యాధితో బాధపడేవారు అరడజన్కు పైగా ఉన్నారని ఒక అంచనా. 2017లో బంగ్లాదేశ్లోనే ఓ బాలిక కూడా ఈ విధమైన వ్యాధితో చికిత్స తీసుకొంది. డాక్టర్లు ఆమెకు విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేశామని చెప్పినప్పటికీ, ఆ వ్యాధి తిరగదోడినట్లు బాలిక తండ్రి పేర్కొన్నాడు.