ఆర్టీసీ సమ్మె పరిష్కరించనందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ప్రగతి భవన్ ముట్టడి పిలుపునిచ్చింది. గాంధీభవన్ నుంచి ర్యాలీగా ఆ పార్టీ నేతలు ప్రగతి భవన్ను ముట్టడించేందుకు కాంగ్రెస్ నేతలు వ్యూహాత్మకంగా సిద్ధమవుతున్నారు. అయితే ముందస్తుగా కాంగ్రెస నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. హైదరాబాద్, జూబ్లిహిల్స్ లోని తన నివాసం నుంచి ప్రగతి భవన్ కు బయలుదేరిన రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
పోలీసులను తప్పించుకొని కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా ప్రగతి భవన్ ముట్టడికి వచ్చారు. ఇక్కడి సమీపంలోని ఓ హోటల్కు చేరుకుని, ఓ ఆటోలో ప్రగతి భవన్ కు బయలుదేరారు. అయితే, అంతలోనే ఆయనను పోలీసులు అరెస్టు చేశారు.ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రగతి భవన్ వద్ద నిరసన తెలుపుతామని అన్నారు. న్యాయస్థాన ఆదేశాలను కూడా సర్కారు లెక్కచేయట్లేదని మండిపడ్డారు.