తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ నాయకురాలు డీకే అరుణ విరుచుకుపడ్డారు. కేసీఆర్ అవినీతి బయటపడి జైలుకు పోయే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఆమె మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులు గొంతెమ్మ కోర్కెలు కోరటం లేదన్నారు. ప్రభుత్వం ఇలాగే నిర్లక్ష్యంతో వ్యవహరిస్తే సకల జనుల సమ్మెగా మారుతున్న ఆర్టీసీ సమ్మెలో కేసీఆర్ కొట్టుకుపోతాడని డీకే అరుణ విమర్శించారు.
ఆర్టీసీ కార్మికులను సెల్ఫ్ డిస్మిస్ అనడానికి కేసీఆర్కు అర్హత లేదని, సెల్ఫ్ డిస్మిస్ అనే పదం కేసీఆర్కే వర్తిస్తుంది కానీ కార్మికులకు కాదన్నారు. లక్షల కోట్లు అప్పులు తెచ్చుకున్నా కేసీఆర్.. ఆర్టీసీ అప్పులు మాత్రం చెల్లించలేక పోయారన్నారు. ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిలు ఎందుకు చెల్లించ లేదో వివరించాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్టీసీని పరిరక్షించాల్సిన ప్రభుత్వం, ఆర్టీసీ ఆస్తులను టీఆర్ఎస్ నాయకుల చేతుల్లో పెట్టి చోద్యం చూస్తోందని విమర్శించారు.