హుజూర్నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ భవన్ లో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ గెలుపు ఆషామాషీ గెలుపు కాదని, ప్రజలు ఆలోచించి ఓట్లు వేశారని అన్నారు. ఉపఎన్నికలకు ముందు నిర్వహించాల్సిన సభకు ప్రతీకూల వాతావరణ పరిస్థితుల్లో నేను వెళ్లలేకపోయినప్పటికీ కూడా ప్రజలు అద్భుత మెజార్టీ ఇచ్చారన్నారు.
ప్రజల కోసం పాటుపడుతున్న ప్రభుత్వానికి ఈ గెలుపు ఓ టానిక్ లాంటిదని చెప్పారు. హుజూర్నగర్ ప్రజలు ఏఏ ఆశలు పెట్టుకుని టీఆర్ఎస్ను గెలిపించారో వందశాతం వాళ్ల కోరికలు తీర్చుతామని పేర్కొన్నారు.ఇంత అద్భుత విజయాన్ని అందించిన ప్రజల కోసం ఎల్లుండి హుజూర్ నగర్ లో కృతజ్ఞత సభ నిర్వహిస్తామని అన్నారు.