ఇటీవల కలకత్తాలో మమతా బెనర్జీ ఆధ్వర్యంలో జరిగిన విపక్షాల ఐక్యతా ర్యాలీ గురించి తెలిసిందే. అదే తరహా ర్యాలీ, బహిరంగ సభను అమరావతిలో నిర్వహిస్తామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం టీడీపీ నేతలు, ఇన్ చార్జ్ లు, ముఖ్య కార్యకర్తలతో టెలి కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ఆయన, కోల్ కతా సభ దేశ ప్రజలకు ఓ భరోసాను ఇచ్చిందని అభిప్రాయపడ్డారు. అతి త్వరలోనే అమరావతిలో దానికి దీటైన సభను నిర్వహిస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా 22 ప్రాంతీయ పార్టీల అధినేతలు ఈ ర్యాలీకి హాజరవుతారని చెప్పారు.
అసెంబ్లీ వేదికగా, కేసీఆర్ మాట్లాడుతూ, వైఎస్ ను పొగిడారని, నరేంద్ర మోదీ డైరెక్షన్ వల్లే ఇప్పుడు జగన్ తో కలవాలని కేసీఆర్ ప్రయత్నాలు ప్రారంభించారని నిప్పులు చెరిగారు. ఈ రెండు పార్టీలూ కలిసి ఏపీని ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నాయని, ప్రజలు వీరిని అడ్డుకోవాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు.