ఉత్తరాదిని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. బిహార్లో కూడా కుండపోత వర్షాలకు జనజీవనం అస్తవ్యస్థమవుతోంది. పలు జిల్లాల్లో అపారనష్టం జరిగింది. వర్షాల ధాటికి రాష్ట్రవ్యాప్తంగా 13 మంది మృతి చెందగా, చాలామంది ప్రజలు గాయాల పాలయ్యారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో ప్రజా రవాణాకు అంతరాయం కలిగింది. విద్యుత్ ఉపకేంద్రాల్లోకి నీరు చేరడంతో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
బరారి వద్ద దేవాలయ ప్రహారీ కూలి ముగ్గురు మృతి చెందగా, ఖాన్జార్పూర్ ప్రాంతంలో వాన ఉధృతికి ఓ భవనం కుప్పకూలింది. పట్నా శివార్లలో ఆటోపై చెట్టు కూలి నలుగురు ప్రయాణీకులు అక్కడికక్కడే మరణించారు. ఖైమూర్ జిల్లాలో రెండు మట్టి ఇళ్లు కూలి ముగ్గురు మృతి చెందారు. వర్షం నీటితో పట్నా వీధులు చెరువులను తలపిస్తున్నాయి. ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతోంది.