దేశీయ తొలి సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ట్రైన్ 18 ఎక్స్ ప్రెస్ ట్రయల్ రన్ దిల్లీ-కర్తా మార్గంలో విజయవంతం అయినట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఈ రైలు సర్వీసు దిల్లీ-వారణాసి మధ్య ప్రారంభమైన విషయం తెలిసిందే. న్యూ దిల్లీ-శ్రీ వైష్ణో దేవి కత్రా మధ్య అక్టోబర్ 3 నుండి ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. దీని ద్వారా ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణ సమయం 12 గంటల నుండి 8 గంటలకు తగ్గనుంది. ట్రయల్ రన్లో భాగంగా ఈ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్లు తెలిపారు. న్యూ దిల్లీ-కత్రా మార్గంలో ట్రాక్ నిర్మాణం, గతంలో జరిగన రైలు ప్రమాదాలు, రైల్వే గేట్ల సంఖ్యను పరిగణలోకి తీసుకొని ఈ రైలు అత్యధిక వేగం గంటకు 130 కిలోమీటర్లుగా నిర్ణయించినట్లు రైల్వే వర్గాలు తెలిపాయి.
ఈ రైల్లో మొత్తం 16 కోచ్లు ఉన్నాయి. వీటిలో రెండు డ్రైవర్ కోచ్లు, రెండు ఎగ్జ్యిక్యూటివ్ చైర్ కార్ కోచ్లు కాగా మిగిలిన 12 చైర్ కార్ కోచ్లు. దేశంలో అత్యంత వేగవంతమైన రైలుగా పేరొందిన ఈ రైలు ప్రతికోచ్లో అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ట్రైన్ 18 లో సీసీటివి పర్యవేక్షణ, ఆటోమేటిక్ డోర్స్, ఎల్ఈడి తెరలు, కంప్యూటరైజ్డ్ సిస్టం, ఎగ్జ్యిక్యూటివ్ కోచ్లో 360 డిగ్రీ కోణంలో తిరిగే సీట్లు ఉన్నట్లు తెలిపారు.