సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగరేణి కాలనీకి చెందిన అభం,శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిని రాజు అనే మానవ మృగం అత్యాచారానికి పాల్పడి, దారుణంగా హత్య చేశాడు. అయితే ఘటన అనంతరం పరారీలో ఉన్న నిందితుడు రాజు కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఘటన జరిగి వారం గడుస్తున్నా ఇంకా పోలీసులకు చిక్కకుండా తప్పించుకొని తిరుగుతున్న రాజును పట్టుకున్న వారికి రివార్డు కూడా అందిస్తామని సీపీ అంజనీ కుమార్ ప్రకటించారు. నిందితుడికి సంబంధించిన ఆనవాళ్లు విడుదల చేశారు. ఇప్పటికే పది బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆ కీచకుడిని ఎన్కౌంటర్ చేయాలని వాదనలు వినిపిస్తున్నాయి.
సెలబ్రిటీలు సైతం రాజుకి కఠిన శిక్షలు వేయలని కోరుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ హీరోలు మహేశ్ బాబు, మంచు మనోజ్ సోషల్ మీడియా ద్వారా రాజు అనే నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తాజాగా నాని కూడా ట్విట్టర్ వేదికగా స్పందించాడు. తెలంగాణ పోలీసులు విడుదల చేసి.. ట్వీట్ చేసిన లుకవుట్ నోటీస్ ను షేర్ చేస్తూ.. బయటెక్కడో ఉన్నాడు.. ఉండకూడదు అంటూ స్పందించాడు.
కాగా..నిందితుడు రాజు యాదాద్రి భువనగిరి జిల్లా చందంపేట మండలానికి చెందిన పల్లంకొండ రాజు ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చాడు. ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ.. చోరీలకు పాల్పడేవాడు. నిత్యం మద్యం మత్తులో ఉంటూ.. ఇరుగు పొరుగు వారితో దురుసుగా ప్రవర్తించేవాడు. ఆరోజు కూడా చిన్నారికి చాక్లెట్ ఆశ చూపించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.