telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ధవళేశ్వరం వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి..భద్రాచ‌లానికి వ‌ర‌ద ముప్పు..

*ధవళేశ్వరం వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి
*గోదారి ఉగ్ర‌రూపం..భద్రాచ‌లానికి వ‌ర‌ద ముప్పు..
*జ‌లాశ‌యాలు గోదావ‌రి సంద‌ర్శ‌న‌కు రావొద్ద‌ని ఆధికారులు ఆదేశాలు
*గోదావరి ఉద్ధృతితో మునిగిన పుష్కరఘాట్లు..
*ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్న ఉభయ నదులు
*రెండో ప్రమాద హెచ్చరిక స్థాయి దాటిన వరద ప్రవాహం

తెలుగురాష్ర్టాల్లో ఎడ‌తెర‌పి లేకుండా కురుస్తున్న వ‌ర్షాల‌తో జ‌న‌జీవ‌నం అస్త‌వ్య‌స్తంగా మారింది. భారీ వ‌ర్షాలుతో గోదావరి ఉగ్ర‌రూపం దాల్చుతోంది. మంగళవారం ఉదయం నుంచి తగ్గుముఖం పడుతూ వస్తున్న గోదావరి నీటిమట్టం.. ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరిలోకి వరదనీరు పోటెత్తుతోంది.

 లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన అధికారులు.. వారు అప్పుడే తిరిగి గ్రామాలకు చేరుకోవద్దని సూచిస్తున్నారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. 13,31,102 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుంది. 

భద్రాచలం వద్ద రెండురోజులుగా గోదావరి ఉగ్రరూపం దాల్చి ఏజెన్సీ ప్రాంతాల ప్రజలకు కంటిమీద కనుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే భద్రాలచం జిల్లాలోని ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 

గోదావరి నది పరివాహక ప్రాంతంతో పాటు మహారాష్ట్రలో కూడా భారీ వర్షాలు కురవడంతో గోదావరికి వరద పోటెత్తింది. నిన్న సాయంత్రానికి గోదవరికి భద్రాచలం వద్ద వరద ప్రవాహం కొంత తగ్గింది. దీంతో మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించుకున్నారు. కానీ రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. ఇదే తరుణంలో వరద ప్రవాహం మళ్లీ పెరగడంతో గోదావరికి మరోసారి భారీ ఎత్తున భద్రాచలం వద్ద వరద పోటెత్తే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మూడో ప్రమాద హెచ్చరికను దాటి వరద ప్రవాహం ఉండే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. భద్రాచలం నుండి ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు బందయ్యాయి. భద్రాచలం నుండి ఛత్తీస్ ఘడ్ కు వెళ్లే జాతీయ రహదారిపై కూడా వదర నీరు పోటెత్తడంతో పోలీసులు ఈ రహదారిలో వాహనాల రాకపోకలను నిలిపివేశారు.

 మహారాష్ట్రలోని నాసిక్ నుండి కూడా దిగువన ఉన్న ధవళేశ్వరం వరకు గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడం కూడా పెద్ద ఎత్తున వరద వచ్చి  చేరుతుందని అధికారులు చెబుతున్నారు.బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది.  భద్రాచలానికి ఎగువన ఉన్న కాళేశ్వరం పుష్కరఘాట్ వద్ద 13.73 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవాహం కొనసాగుతుంది

 కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడగడ్డ బ్యారేజీలోకి భారీగా గోదావరి వరద వచ్చి చేరుతుంది.  12,10,600 క్యూసెక్కుల నీరు వస్తుంది. అంతే స్థాయిలో నీటిని  దిగువకు విడుదల చేస్తున్నారు.  బ్యారేజీ వద్ద 85 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.  సరస్వతి బ్యారేజీకి వరద ప్రవాహం కొనసాగుతుంది. ఇన్ ఫ్లో, అవుట్ ప్లో 7,78,000లుగా ఉందని అధికారులు ప్రకటించారు. సరస్వతి బ్యారేజీ 62 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.సరస్వతి బ్యారేజీ నీటి మట్టం 3.28 టీఎంసీలు, బ్యారేజీ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 10.87 టీఎంసీలు

Related posts