గాల్వన్ ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు చనిపోయిన ఘటనపై తొలిసారి చైనా సైన్యం వివరణ ఇచ్చింది. గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణపై చైనా రక్షణశాఖ ప్రతినిధి వూ కియాన్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. భారత, చైనా సరిహద్దు సమస్యలో.. బాధ్యత అంతా భారత్పైనే ఉందని ఆయన అన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో శాంతిని, స్థిరత్వాన్ని చైనా కాంక్షిస్తున్నదన్నారు.
భారత్ రెచ్చగొట్టడం వల్లే ఆ ఘర్షణ జరిగినట్లు ఆయన చెప్పారు. రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని భారత సైన్యం ఉల్లంఘించినట్లు చైనా రక్షణశాఖ ప్రతినిధి వూ కియన్ తెలిపారు. గాల్వన్ దాడి తర్వాత రెండు దేశాలకు చెందిన రక్షణశాఖ మంత్రులు ఫోన్లో మాట్లాడుకున్నట్లు చైనా రక్షణశాఖ వెల్లడించింది.
భారత దళాలు ఎల్ఏసీ దాటి చైనా వైపుకు వచ్చాయని, ఆ స్పాట్లో చర్చలు జరుగుతుండగానే.. చైనా సైనికులపై భారత దళాలు ఆకస్మికంగా దాడి చేశాయని, దీంతో రెండు దేశాల సైనికులు బాహాబాహీకి దిగారని, దాని వల్ల సైనికులు చనిపోయినట్లు వూ కియాన్ తెలిపారు. కానీ భారత్ మాత్రం ఈ వాదనను తోసిపుచ్చుతున్నది. చైనా ముందస్తుగానే ప్లాన్ ప్రకారం మన సైన్యంపై దాడి చేసినట్లు భారత్ పేర్కొన్నది.