ఆఫ్రికా దేశం సియెర్రా లియోన్లో ఘోర ప్రమాదం జరిగింది. రాజధాని ఫ్రీటౌన్ నగరంలో ఆయిల్ ట్యాంకర్ పేలడంతో 91 మంది మరణించారు. 100 మందికి పైగా మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని, బాధితులకు చికిత్స కొనసాగుతోందని సమాచారం.
ఓ ఆయిల్ ట్యాంకర్.. గ్యాస్ స్టేషన్ వద్ద ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో కూడిన ఓ బస్సు వచ్చి ఆయిల్ ట్యాంకర్ను ఢీ కొట్టింది. దీంతో ట్యాంకర్ నుంచి చమురు లీక్ కావడంతో తీసుకెళ్లడానికి చాలామంది జనం పోగయ్యారు. పెట్రోల్ ట్యాంక్ నుంచి రోడ్డుపై పోతున్న పెట్రోల్ను బాటిల్స్, క్యాన్లు, డబ్బాలతో జనం పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అదే సమయంలో చాలా మంది స్థానికులు గ్యాస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఇదే వాళ్ల పాలిట శాపంగా మారింది. ఈ సమయంలోనే భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. చాలా మంది అక్కడక్కడే ప్రాణాలు కోల్పోయారు.
కాలిపోయిన వ్యక్తులు.. వారి మృతదేహాలు రోడ్డుపై అలా పడిపోయాయి. అక్కడి పరిస్థితులు భయంకరంగా మారిపోయాయని సియెర్రా లియోన్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ (ఎన్డీఎంఏ) కమ్యూనికేషన్స్ డైరెక్టర్ మహ్మద్ లామరానే బాహ్ తెలిపారు. రోడ్డుపై వెళుతున్న వారితోపాటు దుకాణాల్లో ఉన్నవారిపైనా ఆయిల్ పడటంతో ఎక్కడ చూసిన కాలిన శవాలే కన్పిస్తున్నాయని అన్నారు.
ఈ ఘటన పట్ల సియోర్రా లియోన్ అధ్యక్షుడు జులియస్ మాడ బయో.. విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన.. కాప్26 వాతావరణ సదస్సు కోసం స్కాట్లాండ్లో ఉన్నారు.