రాజస్థాన్లో భూకబ్జాదారుల చేతిలో పూజారి హత్యకు గురైన కేసులో విచారణ వేగవంతమైంది. ఈ ఘటనలో మొత్తం ఐదుగురు ప్రమేయమున్నట్లు గుర్తించిన పోలీసులు.. ప్రధాన నిందితుడు కైలాశ్ మీనాను అరెస్ట్ చేశారు. నిందితులపై మర్డర్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు ఆలయ పూజారి హత్య దురదృష్టకరమన్నారు సీఎం అశోక్ గహ్లాట్. నిందితులను కఠినంగా శిక్షిస్తామని.. మృతుని కుటుంబానికి హామీ ఇచ్చారు. ఆలయ పూజారి కుటుంబానికి రాజస్థాన్ ప్రభుత్వం పదిలక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని, పీఎం ఆవాస్ యోజన కింద లక్షన్నర సాయం అందజేస్తామని తెలిపింది.
ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహారంలో స్థానిక ఎస్హెచ్ఓ, పట్వారిని సస్పెండ్ చేసింది. పూజారి హత్యపై ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా స్పందించింది. రాజస్తాన్లో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్ పూర్ణియా విమర్శించారు. రాష్ట్రంలో ఎవరికీ రక్షణ లేకుండా పోయిందని మాజీ సీఎం వసుంధరా రాజే సింధియా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్తాన్లో నేరగాళ్లు చెలరేగిపోతున్నారని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆరోపించారు. ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ రాజకీయ పర్యటనలు చేయడానికి బదులు…రాజస్తాన్లో జరుగుతున్న ఘోరాలపై అక్కడి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.