కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసకుంది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఘన్ పూర్ వద్ద ఆర్టీసీ బస్సు- కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతిచెందారు. ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మాచారెడ్డి మండలం ఘన్పూర్ ఎం. వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు. .ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది.
కరీంనగర్ డిపో -1 కు చెందిన ఆర్టీసీ బస్సు కరీంనగర్ నుంచి కామారెడ్డి వైపు వస్తుండగా టైర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. కారులో చిక్కుకున్న మృతదేహాలను పోలీసులు బయటకు తీశారు.
మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు, బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా ఓ చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన చిన్నారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.