మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ను సోమవారం రాత్రి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) 12 గంటల పాటు విచారించిన తర్వాత రాష్ట్ర పోలీసు వ్యవస్థలో దోపిడీ రాకెట్తో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.
దేశ్ముఖ్ ను మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్ఎ) కింద అరెస్టు చేసినట్లు వారు తెలిపారు. కోట్ల రూపాయలు లంచం డిమాండ్ చేశారని ఆరోపణలతో అనిల్ దేశ్ముఖ్ మహారాష్ట్ర మంత్రివర్గం నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. దీంతో మనీలాండరింగ్ అంశంలో అనిల్ దేశ్ముఖ్కు ఈడీ సమన్లు జారీ చేసింది. వీటిని సవాల్ చేస్తూ ఆయన బాంబే హైకోర్టును ఆశ్రయించినప్పటకీ కోర్టు తన పిటిషన్ను తిరస్కరించింది.
అయితే, ఇటీవల దేశ్ముఖ్ ఆస్తులపై ఈడీ దాడి చేసి పలు ఆస్తులను జప్తు చేసింది.ముంబయిలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాలంటూ సస్పెండ్ అయిన పోలీసు అధికారి సచిన్ వాజేను అనిల్ దేశ్ముఖ్ ఆదేశించినట్లు ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ చేసిన ఆరోపణలు గతంలో సంచలనం అయ్యాయి.
దీంతో ఏప్రిల్లో అనిల్ దేశ్ముఖ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో అనిల్ దేశ్ముఖ్పై విచారణ చేపట్టాలని బాంబే హైకోర్టు సీబీఐని ఆదేశించింది.
ఈ ఆరోపణలపై విచారణ జరిపిన కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ఆయనపై కేసు నమోదు చేసింది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఆయనపై చర్యలు చేపట్టింది.