దేవుడు దయతో ప్రజల దీవెనలతో ‘జగన్ అనే నేను’ ఈ స్థానంలోకి వచ్చానని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. నంద్యాల జిల్లాలో వసతి దీవెన కార్యక్రమాన్ని ప్రారంభించిన జగన్ విపక్షాలపై విరుచుకుపడ్డారు.
పిల్లలు ఇచ్చే చిక్కీపై జగన్ బొమ్మ ఉందంటూ చిల్లర రాజకీయాలతో రాద్ధాంతం చేస్తున్న చంద్రబాబుతో పాటు ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ లు, ఎల్లో మీడియాదేనని ఎద్దేవా చేశారు.
చివరికి పిల్లలకు అందుతున్న సంక్షేమ పథకంపై కూడా అక్కసు వెల్లగక్కుతున్నారంటూ మండిపడ్డారు.రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలతో విపక్షాలకు కడుపు మంట, అసూయకు మందే లేదని అన్నారు.
అసూయ ఎక్కువైతే బీపీ, షుగర్ తో పాటు గుండెపోటు వస్తుందని జగన్ చెప్పారు. అది అలానే కొనసాగితే ఏదో ఒక రోజు టికెట్ తీసుకుంటారని జగన్ శాపనార్ధాలు పెట్టారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కేోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడితే వాటికి సహకరించకపోగా రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లేందుకే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఎల్లో మీడియా ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. రోజుకో కట్టు కథను ప్రచారం చేస్తున్నారన్నారు. పార్లమెంట్ వేదికగా కూడా కట్టుకథలను ప్రచారం చేసి రాష్ట్ర పరువును తీశారని జగన్ టీడీపీపై మండిపడ్డారు.
బెంగాల్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా విపక్షాలున్నాయన్నారు. కానీ రాష్ట్రం పరువును పార్లమెంట్ లో తీసే ప్రయత్నాలు ఆయా రాష్ట్రాల్లో విపక్షాలు చేయలేదన్నారు.
ఎక్కడైనా ప్రతిపక్షాలు అనేవి రాష్ట్రం పరువు కోసం ఆరాటపడతాయని.. కానీ, మన రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యమైన ఏంటంటే.. ఇలాంటి ప్రతిపక్ష నేత.. ఆయన దత్త పుత్రుడు, యెల్లో మీడియాలు ఉండటం.. పరువు తీయడం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇవేవీ తనను బెదిరించలేవని, దేవుని దయ, ప్రజల అభిమానం ఉన్నంత వరకు నా వెంట్రుక కూడా పీకలేరని అన్నారు.