పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే అసలైన ఆస్తి చదువేనని, పేదరికం కారణంతో చదువులు ఎట్టిపరిస్థితుల్లో ఆగిపోకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు
నంద్యాల ఎస్పీజీ గ్రౌండ్ వేదికగా 2021-22 విద్యాసంవత్సరానికి గానూ రెండో విడత ‘జగనన్న వసతి దీవెన’ లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో సీఎం వైఎస్ జగన్ నగదు జమ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
పరిపాలన సంస్కరణలో భాగంగా ప్రతి పార్లమెంట్ను ఒక జిల్లాగా చేస్తానని, సుపరి పాలనను ప్రజలకు చేరవేస్తానని అన్నారు.
చదువు కోసం దివంగత నేత వైఎస్సార్ హయాంలో పూర్తి ఫీజు రీయంబర్స్మెంట్ ఇస్తే.. జగన్ అనే నేను ఆయన వారసుడిగా రెండు అడుగులు వేస్తున్నానని చెప్పారు.
పేద పిల్లల కోసం రెండు అడుగులు ముందుకు వేస్తున్నామని చెప్పాను, పరిపాలన సంస్కరణల్లో భాగంగా కొత్త జిల్లాల ఏర్పాటు చేశామని సీఎం జగన్ అన్నారు.
10 లక్షల మందికి జగనన్న వసతి దీవెన కింద 2021 22 కి 1,024 కోట్లు తల్లుల ఖాతాలోకి వేస్తున్నాం. కోర్సును బట్టి 10 వేలు, 15, వేలు, 20 వేలు జగనన్న వసతి దీవెన కింద ఇస్తున్నామని అన్నారు.
ఇంట్లో ఎంత మంది చదివితే అంత మందికి ఇస్తాం. తల్లుల ఖాతాలోకి రెండు విడతలుగా ఇస్తాం. జగనన్న వున్నాడని మీరు భరోసాతో వుండండి. అన్నీ నేను చూసుకుంటాను .ప్రతీ ఇంటి మేనమామగా పిల్లలను చదివించే బాధ్యత తనదని మరోసారి తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు.
విద్యాసంస్థల్లో వసతులు సైతం మెరుగుపడతాయని, బాగోలేకపోతే ప్రభుత్వం దృష్టికి ఆ తల్లులు తీసుకురావొచ్చని, అవసరమైన చర్యలు తీసుకుంటామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. చదువుతో పాటు మంచి భోజనాన్ని సైతం పిల్లలకు అందించడం గర్వంగా ఉందని సీఎం జగన్ అన్నారు.