ఏపీ రాజ్ భవన్ లో జరిగిన ఎట్ హోమ్ కార్యక్రమం లో ప్రత్యేకత సంతరించుకుంది. ఈ ఎట్ హోంకు ఏపీ ముఖ్యమంత్రి జగన్, చంద్రబాబు హాజరయ్యారు.
75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సందర్భంగా రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ తేనేటి విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ తన సతీమణి భారతితో పాటు హాజరయ్యారు.
అలాగే.. టీడీపీ అధినేత చంద్రబాబు, అచ్చెన్నాయుడు, ఎంపీ కేశినేని నాని, హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15వ తేదీ సాయంత్రం రాజ్ భవన్ లో గవర్నర్ ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగానే నిన్న సాయంత్రం 5.30 నుంచి 6.30 వరకూ ఎట్ హోం కార్యక్రమం రాజ్ భవన్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులను గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ సాదరంగా ఆహ్వానించారు.
ఈ ఎట్ హోం కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ సీఎం వైఎస్ జగన్, విపక్ష నేత చంద్రబాబులు ఎడమొహం.. పెడమొహంగానే తలో దిక్కున కూర్చున్నారు. ఈ తేనీటి విందుకు పవన్ కల్యాణ్ రాకపోవడం గమనార్హం.
ప్రధాన టేబుల్ వద్ద సీఎం జగన్ దంపతులు, గవర్నర్ దంపతులతో పాటు హైకోర్టు సీజే పీకే మిశ్రా దంపతులు కూర్చున్నారు. వేదిక ఎడమ వైపు టేబుల్ వద్ద చంద్రబాబు, అచ్చెన్నాయుడు, ఎంపీ కేశినేని నాని మరికొందరు టీడీపీ నాయకులు కూర్చున్నారు. కార్యక్రమంలో జగన్, చంద్రబాబు ఒకరికొకరు ఎక్కడా ఎదురు పడలేదు.
దాదాపుగా మూడేళ్ల తర్వాత సీఎం జగన్, టీడీపీ చీఫ్ చంద్రబాబులు ఎట్ హోం కార్యక్రమంలో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది.
ఎట్ హోం కార్యక్రమం ముగిశాక సీఎం బయలుదేరుతున్నారనే సమాచారంతో, చంద్రబాబు కొన్ని నిమిషాల పాటు వేచి ఉన్నారు. సీఎం కాన్వాయ్ కు సంబంధించి ట్రాఫిక్ క్లియర్ అయిన తర్వాత అప్పుడు చంద్రబాబు తన వాహనంలో వెళ్లిపోయారు.