రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను సమీక్షించేందుకు ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల పట్ల ప్రముఖ రేటింగ్స్ సంస్థ ‘ఫిచ్’ ఆందోళన వ్యక్తం చేసింది. సోలార్, పవన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై సమీక్షలకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని, ప్రభుత్వ చర్యలు విద్యుదుత్పత్తి కంపెనీలపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయని ఫిచ్ హెచ్చరించింది.
ఉత్పత్తి సంస్థల నగదు ప్రవాహానికి, ప్రభుత్వ ప్రయత్నాలతో ఆటంకాలు ఏర్పడతాయని వివరించింది. పునరుత్పాదక విద్యుత్ సంస్థలు, కేంద్రం నుంచి ప్రభుత్వం సవాళ్లు ఎదుర్కోవాల్సి రావొచ్చని ఫిచ్ అంచనా వేసింది. ప్రభుత్వం పీపీఏలపై పునఃసమీక్షలు నిర్వహించే ప్రయత్నం చేసినా విద్యుత్ సంస్థలకు ఇబ్బందులు తప్పవని పేర్కొంది. పీపీఏల్లో అక్రమాలు జరిగాయంటూ సర్కారు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఫిచ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.