అమరావతి ప్రాంతంలో భూమి విలువ పెరిగితే జగన్ కు కడుపుమంట ఎందుకని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. ఈ రోజు ఎర్రబాలెంలో రైతులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. తానిచ్చిన ఒక్క పిలుపుతో రైతులంతా ముందుకు కదిలివచ్చి 33 వేల ఎకరాలను స్వచ్ఛందంగా ఇచ్చారని చంద్రబాబు గుర్తు చేశారు. ఇప్పుడు రాజధానిని మారుస్తామంటే, వారు పడుతున్న ఆవేదన చూసి తన మనసు చలించి పోతున్నదని అన్నారు. రాజధాని రైతులకు అండగా ఉంటామని స్పష్టం చేసిన ఆయన, రాజధానిని తరలిస్తామని చెబితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.
హైదరాబాద్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినట్టుగానే అమరావతిని కూడా అభివృద్ధి చేయాలని భావించానని అన్నారు. అమరావతి ప్రాంతం ఎంతో సురక్షితమని నిపుణులు చెప్పిన తరువాతనే రాజధానిని ఇక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని అన్నారు. రాష్ట్ర విభజన తరువాత ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చిందని, వాటన్నింటినీ భరిస్తూ ముందుకు సాగామని చెప్పారు. భావి తరాల కోసం ఎవరూ ఊహించని విధంగా అభివృద్ధి ప్రణాళికలకు రూపకల్పన చేశామని అన్నారు