telugu navyamedia
రాజకీయ వార్తలు

పేదలకు నగదు అందించాలి.. మోదీకి లేఖ రాసిన సోనియా

soniya gandhi

కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సమయంలో కేంద్రం తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోందని ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. కోవిడ్-19 నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి సోనియా లేఖ రాశారు. లాక్ డౌన్ కాలంలో ప్రజలను అన్ని విధాలా ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని సోనియా తన లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని పేదలను అన్నివిధాల ఆదుకోవాలని లేఖలో పేర్కొన్నారు.  

  రైతుల నుంచి రుణచెల్లింపులను ఓ ఆరు నెలల పాటు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. 21 రోజుల లాక్ డౌన్ కాలంలో ప్రజలకు చేయూతనిచ్చే క్రమంలో ప్రతి జన్ ధన్ ఖాతాదారుకు, ప్రతి పీఎం కిసాన్ యోజన్ ఖాతాదారుకు, వృద్ధాప్య, వితంతు పెన్షన్ దారులకు, ఉపాధి హామీ పథకం కూలీలకు ప్రతి ఒక్కరికీ రూ.7,500 చొప్పున ఖాతాలో వేయాలని సూచించారు. రేషన్ దుకాణాల ద్వారా ఒక్కో కార్డుదారుడికి 10 కిలోల బియ్యం లేక 10 కిలోల గోధుమలు ఉచితంగా సరఫరా చేయాలని తెలిపారు.

కరోనాపై పోరాటంలో కీలకంగా నిలుస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందికి ఎన్-95 మాస్కులు, హజ్మట్ సూట్లు వంటి రక్షణ కల్పించే వస్తు సామగ్రిని తక్షణమే అందుబాటులో ఉంచాలని సూచించారు. అభివృద్ధి చెందిన దేశాలు సైతం వెల్లువలా వస్తున్న కరోనా పేషెంట్ల తాకిడిని తట్టుకోలేకపోతున్నాయని, భారత్ లో అలాంటి పరిస్థితి రాకుండా తగినన్ని ఆసుపత్రులు, బెడ్లు, వైద్యులు, ఇతర సిబ్బంది అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సోనియా తన లేఖలో పేర్కొన్నారు.

Related posts