పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత్ వాయు సేన మంగళవారం మెరుపు దాడులు జరిపిన సంగతి తెలిసిందే. 12 మిరాజ్-2000 యుద్ద విమానాలతో దాడులు చేసిన ఇండియన్ ఎయిర్ఫోర్స్ పాక్ ఉగ్ర సంస్థలకు చెందిన కంట్రోల్ రూమ్లను వెయ్యి కేజీల బాంబులతో ధ్వంసం చేశాయి. భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రయిక్స్ తో పాకిస్థాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ నేపథ్యంలో వెంటనే సాయం కోసం చైనాను సంప్రదించింది.
సర్జికల్ దాడులను పూర్తి చేసిన ఫైటర్ జెట్స్ తిరిగి భారత భూభాగంలోకి వెళ్లిపోయిన వెంటనే పాకిస్థాన్ విదేశాంగ మంత్రి పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషి చైనా విదేశాంగ మంత్రి వాంగ్ వీకి ఫోన్ చేసి మాట్లాడారు. ఈ విషయాన్ని చైనా ప్రభుత్వ రంగ అధికార వార్తా సంస్థ ‘క్సిన్హువా’ స్వయంగా వెల్లడించింది. భారత సైన్యం నిబంధనలకు విరుద్ధంగా వాస్తవాధీన రేఖను దాటి ముజఫరాబాద్ సెక్టార్ లోకి ప్రవేశించిందని చైనాకు పాక్ మంత్రి ఫిర్యాదు చేశారు.