ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటే.. రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి అన్నారు. మంగళవారం విజయవాడలో కాంగ్రెస్ రోడ్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలన్నా, సుందరమైన రాజధాని కల నెరవేరాలంటే రాహుల్ దేశ ప్రధాని కావాలని, అందుకోసం ప్రజలంతా కాంగ్రెస్కు ఓట్లు వేసి గెలిపించాలని రఘువీరా పిలుపు ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధించే సత్తా టీడీపీ, వైసీపీకి ఉందా? అని ప్రశ్నించారు.
వచ్చే ఎన్నికల్లో రాహుల్ తప్పకుండా ప్రధానమంత్రి అవుతారని రఘువీరారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. దేశం కోసం నెహ్రూ కుటుంబం ప్రాణత్యాగం చేసిందని కొనియాడారు. సోనియాకు మూడుసార్లు ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా తిరస్కరించారన్నారు. ఏపీకి అన్యాయం చేసిన ప్రధాని మోదీ మార్చి 1న ఏపీకి వస్తున్నారని, ఆయన పర్యటనకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు నల్ల జెండాలతో నిరసన తెలుపుతారని రఘువీరా పేర్కొన్నారు.
ఒకరు భయపెడితే సినిమావాళ్లు భయపడరు: మురళీమోహన్