ట్రైన్ 18, ఇది భారతదేశంలోనే అత్యంత వేగవంతమైన రైలుగా పేరొందింది. ప్రయాణికులకు ఫైవ్ స్టార్ హోటల్ భోజనం పంపిణీ చేయాలని ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) నిర్ణయించింది. ఢిల్లీ నుంచి వారణాసి వరకు నడపనున్న ఈ రైలులో ప్రయాణించే వారికి అలహాబాద్ నగరంలోని ఉన్నతస్థాయి రెస్టారెంట్ నుంచి అల్పాహారం, కాన్పూర్ నగరంలోని ఫైవ్ స్టార్ హోటల్ నుంచి భోజనం తెప్పించి వడ్డించాలని ఐఆర్సీటీసీ నిర్ణయించింది. ఈ నెల 15వతేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించనున్న ట్రైన్ 18లో ప్రయాణికులను స్టార్ హోటళ్ల వంటకాలు అందనున్నాయి.
ట్రైన్ 18 కి వందేభారత్ ఎక్స్ప్రెస్ గా పేరు పెట్టారు. ఈ రైలు ప్రయాణికులకు రుచికరమైన, నాణ్యత గల ఆహారం సరఫరా చేయాలని నిర్ణయించారు. వారణాసి నుంచి ఢిల్లీ వెళ్లే ప్రయాణికులకు భోజనం అలహాబాద్ ఫైవ్ స్టార్ హోటల్ నుంచి సరఫరా చేయాలని నిర్ణయించినట్లు ఐఆర్సీటీసీ అధికారి చెప్పారు. ఆహారాన్ని ప్రయాణికులకు సరఫరా చేసేంత వరకు వెచ్చగా ఉండిపోయే విధంగా ఆహారాన్ని ప్యాక్ చేస్తామని అధికారి పేర్కొన్నారు. రైల్వే సిబ్బంది ప్రయాణికుల పట్ల మర్యాదగా వ్యవహరించేలా వారికి శిక్షణ ఇస్తున్నామన్నారు. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ రైలులో ప్రయాణికులు 8 గంటల్లో తమ గమ్య స్థానానికి చేరుకుంటారు. ప్రయాణికులకు అల్పాహారం, భోజనంతోపాటు చిరుతిళ్లు అందించాలని నిర్ణయించారు. ఈ మేక్ ఇన్ ఇండియా రైలులో ప్రపంచస్థాయి సౌకర్యాలు ప్రయాణికులకు అందించాలని నిర్ణయించినట్లు భారతీయ రైల్వే అధికారులు వివరించారు.