బాల్యవివాహాలు నేరం అని తెలిసిందే. అయితే నేటికీ అక్కడక్కడా అవగాహనా రాహిత్యంతో జరుగుతున్నాయి. తాజాగా, ప్రేమ, పెళ్లి అంటూ 30 ఏళ్ళ వ్యక్తి, 17 ఏళ్ళ బాలికను వేధించడం మొదలుపెట్టాడు. కుదరమైపోయే సరికే బలవంతంగా పెళ్లి చేసుకొన్నాడు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. సిరిపురం గ్రామానికి చెందిన జూపల్లి రామకృష్ణ.. హైదరాబాద్ నాగోల్ ప్రాంతంలోని సాయినగర్ కాలనీలో నివసిస్తున్నాడు. అక్కడే ఓ వాటర్ ప్లాంటులో టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. ఎల్బీనగర్ ప్రాంతంలోని ఓ కాలనీకి చెందిన మైనర్ బాలికను ప్రేమ పేరుతో వేధించాడు. పెండ్లి చేసుకోవాలంటూ వెంటపడ్డాడు. దానికీ సదరు బాలిక నిరాకరించింది.
దానితో తనను కాదన్నదనే కోపంతో, ఈనెల 15న ఆమెను బలవంతంగా అపహరించాడు. మహబూబ్ నగర్ జిల్లా ఆమనగల్ మండలంలోని సిసినగల్లికి తీసుకెళ్లాడు. అక్కడి సీతారామ దేవాలయంలో బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. అనంతరం నువ్వు నా భార్యవంటూ పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఎలాగోలాగా రామకృష్ణ బారి నుంచి తప్పించుకున్న బాలిక హైదరాబాద్ లోని తన ఇంటికి చేరుకుంది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.