ప్రస్తుత ఏపీకి అన్నింటా అండగా ఉండగలిగేది జగనేనని, జగన్ దేవుడి వంటి వాడని కార్మిక శాఖా మంత్రి గుమ్మనూరు జయరాం వ్యాఖ్యానించారు. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలన్న బిల్లుపై అసెంబ్లీలో మాట్లాడిన ఆయన, తాను వాల్మీకి బోయ కుటుంబానికి చెందిన వాడినని, తనకు జగనన్న వాల్మీకేనని అన్నారు. అందరికీ బ్రహ్మ తలరాత రాశాడని చెబుతుంటారని, తనకు మాత్రం జగన్ రాసిన రాతతోనే మంత్రి పదవి దక్కిందని అన్నారు. జగన్ తో కలిసి పాదయాత్ర చేసినప్పుడు ఇచ్చిన హామీని ఆయన నిలబెట్టుకున్నారని కొనియాడారు.
50 శాతం నామినేటెడ్ పదవులు, పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రిజర్వేషన్ కల్పించిన జగన్, ఎస్సీలకు అంబేద్కర్ గా, ముస్లింలకు అల్లాగా, క్రిస్టియన్లకు జీసస్ గా కనిపిస్తున్నారని పొగడ్తల వర్షం కురిపించారు జయరాం. చంద్రబాబుకు, జగన్ కు నక్కకూ, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని అన్నారు. గతంలో ప్రజలను, ప్రజా ప్రతినిధులను చంద్రబాబు వంచించారని, ఎమ్మెల్యేలను అడ్డగోలుగా కొనుగోలు చేసి, ఆపై వారిని మరచిపోయారని విమర్శలు గుప్పించారు.