telugu navyamedia
తెలంగాణ వార్తలు

డబ్బులిచ్చి చేర్చుకునే సంస్కృతి మాది కాదు-రేవంత్‌కు బండి కౌంట‌ర్

ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌‌రెడ్డి వ్యాఖ్యలకు బీజేపీ నేత బండి సంజయ్ కౌంటరిచ్చారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ..డబ్బు, కాంట్రాక్టులిచ్చి చేర్చుకునే సంస్కృతి బీజేపీది కాదని చెప్పారు. ఆ అలవాటు టీఆర్ ఎస్‌, కాంగ్రెస్‌లకు ఉంటాయని ఆరోపించారు.

తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన రాజ్‌గోపాల్‌, దాసోజు ఎందుకు పార్టీ మారుతున్నారో అర్థం చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ నేత సోనియాను తిట్టినవారే ఇప్పుడు పీసీసీ చీఫ్‌ అయ్యారని, కేసీఆర్‌ భాషను ప్రజలు అసహ్యించుకుంటున్నారని సంజయ్‌ తెలిపారు.

రాజగోపాల్‌రెడ్డి చేరితే తప్పేంటి? అయితే వెంకట్‌రెడ్డి చేరుతారో లేదో .. ఆయన్నే అడిగి చెప్తా… దాసోజు శ్రవణ్.. కాంగ్రెస్ పార్టీ కోసం చాలా కష్టపడి పనిచేశారు. కానీ సరైన ఫలితం ఆయనకు దక్కలేదు. విద్యార్థి స్థాయి నుంచి ఆయన కష్టపడి వచ్చారు. ఆయన ఎప్పుడు చేరుతారో త్వరలో ప్రకటిస్తామ‌ని అని అన్నారు.

ఇకపోతే.. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో శుక్రవారం చండూరులో జరిగిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నమ్మిన నాయకురాలిని, భుజాన మోసిన కార్యకర్తలను నట్టేట ముంచి పక్క పార్టీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గుణపాఠం చెప్పాలన్నారు.

కాంగ్రెస్‌ పార్టీకి నయవంచన చేసిన రాజగోపాల్‌రెడ్డిని మునుగోడు గడ్డపై పాతిపెట్టాలని, వచ్చే ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ జెండా ఎగురవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు

2018 ఎన్నికల్లో టికెట్ దక్కనప్పటికీ పాల్వాయి స్రవంతి ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ విజయం కోసం శ్రమించారని ఆయన గుర్తుచేశారు.

వందల ఎకరాల భూములు కరిగిపోయినా కాంగ్రెస్ పార్టీ జెండాను పాల్వాయి గోవర్థన్ రెడ్డి విడిచిపెట్టలేదని రేవంత్ కొనియాడారు. ఆరు దశాబ్ధాల తెలంగాణ కలను సోనియా గాంధీ నెరవేర్చారని ఆయన అన్నారు. మూసేసిన కేసులో సోనియాకు ఈడీ నోటీసులు ఇచ్చిందని రేవంత్ మండిపడ్డారు. కాంగ్రెస్‌ను ఎదుర్కొనే సత్తా లేక మోడీ.. ఈడీని ప్రయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు.

Related posts