ఒక పక్క వరదలతో అల్లాడుతున్నప్పటికీ చెన్నైలో ఎన్నడూ లేనంతగా తాగు నీటికి కొరత ఏర్పడింది. ఆ పరిస్థితిని విన్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్కడిక్కడే స్పందించేశారు. తంబీల దాహార్తిని తీర్చేందుకు యుద్ధ ప్రాతిపదికన కదలాలని ఆయన ఏపీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పొరుగు రాష్ట్రాలు… అది తెలంగాణ అయినా – కర్ణాటక అయినా – తమిళనాడు అయినా… ఆ రాష్ట్రాలతో తాను స్నేహ సంబంధాలనే నెరపుతానంటూ జగన్ ఈ చర్య ద్వారా మరోమారు నిరూపించుకున్నారన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ సర్కారుతో స్నేహ సంబందాలను కొనసాగిస్తున్న జగన్… ఇప్పుడు తమిళనాడు కష్టాలపైనా స్పందించిన తీరుతో తనపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టారన్న వాదన వినిపిస్తోంది.
చెన్నై వాసుల తాగు నీటి కష్టాలను చెప్పి జగన్ సాయం కోరాలని తీర్మానించిన తమిళనాడు సీఎం పళనసామి తన కేబినెట్ లోని ఇద్దరు మంత్రులు – అధికారులను అమరావతికి పంపారు. వారు శుక్రవారం అమరావతిలో జగన్ తో భేటీ అయ్యారు. చెన్నై వాసులు ఎదుర్కొంటున్న తాగునీటి కష్టాలను వారు జగన్ కు వివరించారు. ఈ నేపథ్యంలో ఏమాత్రం ఆలస్యం చేయని జగన్… చెన్నై వాసుల తాగు నీటి కష్టాలను తీర్చే దిశగా ఏపీ నుంచి ఎలాంటి సాయం అందించాలన్న విషయంపై సమాలోచనలు చేసి తక్షణమే చర్యలు చేపట్టాలని అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా పొరుగు రాష్ట్రాలు ఇబ్బందులు పడుతుంటే చూస్తూ కూర్చునే తత్వం తనది కాదని చెప్నిన జగన్ తమిళ మంత్రులను మంత్రముగ్ధులను చేశారని చెప్పాలి. తమ సమస్య పరిష్కారంపై జగన్ స్పందించిన తీరుతో హర్షం వ్యక్తం చేసిన తమిళనాడు మంత్రులు జగన్ కు ధన్యవాదాలు తెలిపారు.
బురద చల్లాలనుకున్న వైసీపీ ప్రభుత్వం అభాసుపాలు: చంద్రబాబు